

టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2027 ఫిబ్రవరి 20తో తన ప్రస్తుత పదవీకాలం ముగిసిన తర్వాత పునర్నియామకాన్ని కోరుకోవడం లేదని 63 ఏళ్ల చంద్రశేఖరన్ ప్రకటించారు. ఆయనకు మూడోసారి పదవీకాలం పొడిగించే విషయంలో టాటా సన్స్ బోర్డు, టాటా ట్రస్టుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, నోయల్ టాటా మద్దతు ఇవ్వకపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
1987లో టీసీఎస్లో ట్రైనీ ప్రోగ్రామర్గా చేరిన చంద్రశేఖరన్. దాదాపు నాలుగు దశాబ్దాలుగా టాటా గ్రూప్కు సేవలందిస్తున్నారు. 2009లో టీసీఎస్ సీఈఓ, ఎండీగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. 2017 జనవరిలో టాటా గ్రూప్ చైర్మన్గా నియమితులయ్యారు. ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్కు చెందిన 26 లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ గణనీయంగా పెరిగింది. గ్రూప్ ఆదాయం, నికర లాభం కూడా భారీగా వృద్ధి చెందాయి. 157 ఏళ్ల టాటా గ్రూప్కు చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తొలి పార్శీయేతర వ్యక్తిగా చంద్రశేఖరన్ గుర్తింపు పొందారు.
కొత్త వ్యాపారాల పనితీరు, భవిష్యత్ పెట్టుబడులు, టాటా సన్స్ లిస్టింగ్ వంటి అంశాలపై టాటా ట్రస్టులు, టాటా సన్స్ బోర్డు మధ్య విభేదాలు పెరిగినట్లు తెలుస్తోంది. తన పునర్నియామకంపై ఆరు నెలలుగా నిర్ణయం వెలువడకపోవడంతో చంద్రశేఖరన్ స్వచ్ఛందంగా తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. నాయకత్వ మార్పు సజావుగా జరిగేందుకు త్వరగా కొత్త చైర్మన్ను ఎంపిక చేయాలని ఆయన బోర్డును కోరారు. చంద్రశేఖరన్కు 2022లో పద్మభూషణ్, 2023లో ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం, 2024లో బ్రిటన్ ప్రభుత్వం నుంచి గౌరవ KBE పురస్కారం లభించాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!