

హైదరాబాద్ మరో భారీ పారిశ్రామిక పెట్టుబడికి కేంద్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) మరియు జర్మనీకి చెందిన గ్రీన్ హైడ్రోజన్ టెక్నాలజీ సంస్థ థైసెన్క్రూప్ న్యుసెరా ఇండియా మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులకు అవసరమైన ఆల్కలైన్ వాటర్ ఎలక్ట్రోలైజర్ సిస్టమ్స్ను దేశీయంగా తయారు చేయనున్నారు.
దశల వారీగా దాదాపు రూ.10,000 కోట్ల పెట్టుబడితో ఈ తయారీ ప్లాంట్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నీటి నుంచి గ్రీన్ హైడ్రోజన్ను వేరు చేసే ప్రక్రియలో ఎలక్ట్రోలైజర్లు కీలక పాత్ర పోషిస్తాయి. దేశంలో గ్రీన్ హైడ్రోజన్ రంగానికి అవసరమైన సాంకేతికతను స్వదేశీకరించడమే ఈ భాగస్వామ్య ఒప్పందం ప్రధాన లక్ష్యమని బీహెచ్ఈఎల్ తెలిపింది.
ఇక థైసెన్క్రూప్ న్యుసెరా ఇండియా ఇప్పటికే హైదరాబాద్కు చెందిన జునో జోల్ గ్రీన్ ఎనర్జీతో కూడా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద 260 మెగావాట్ల గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్కు అవసరమైన ఇంజినీరింగ్ సేవలను అందించనుంది. మరోవైపు సిద్ధిపేట జిల్లా నర్మెట్టలో రూ.700 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్రాజెక్టు తొలి దశ వచ్చే ఏడాది మే నాటికి ఉత్పత్తి ప్రారంభించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!