

ఫోన్పే సంస్థ ఇనాక్టివ్ వాలెట్లపై ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వినియోగదారులకు సందేశాలు పంపడంతో నెట్టింట చర్చకు దారి తీసింది. ఏడాది పాటు లావాదేవీలు జరగని వాలెట్లపై ఫీజులు విధిస్తామని తెలిపింది. దీంతో యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వాలెట్ ఉంచడమే తప్పా అంటూ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
కంపెనీ ప్రకారం, 12 నెలల పాటు ఉపయోగించని వాలెట్లను ఇనాక్టివ్గా పరిగణిస్తారు. అలాంటి వాలెట్లపై మూడు నెలలకు రూ.100 చొప్పున నిర్వహణ ఛార్జీలు విధిస్తారు. ఈ విషయాన్ని టర్మ్స్ అండ్ కండీషన్స్లో పేర్కొన్నప్పటికీ, పూర్తి వివరాలు స్పష్టంగా తెలియజేయలేదని విమర్శలు ఉన్నాయి. 15 రోజుల ముందుగా నోటిఫికేషన్ ఇచ్చి, ఈలోపు వాలెట్ యాక్టివేట్ చేసుకుంటే ఛార్జీలు తప్పించుకోవచ్చని కంపెనీ తెలిపింది.
ఇప్పటి పరిస్థితుల్లో యూపీఐ లావాదేవీలే అధికంగా ఉండగా, వాలెట్ వినియోగం గణనీయంగా తగ్గిందని యూజర్లు చెబుతున్నారు. చాలా మందికి వాలెట్ చివరిసారి ఎప్పుడు వాడారో కూడా తెలియదు. అలాంటి సందర్భంలో ఫీజులు విధించడం అన్యాయం అని విమర్శిస్తున్నారు. కొందరు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ను ట్యాగ్ చేస్తూ ఈ నిర్ణయంపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!