

భారత్కు రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు జులైలో రికార్డు గరిష్ఠానికి చేరుకున్నాయి. రోజుకు సుమారు 2.8 మిలియన్ బ్యారెళ్ల (ఎంబీడీ) చొప్పున రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంది. హర్మూజ్ జలసంధిలో పరిస్థితులు మెరుగుపడడంతో పశ్చిమాసియా దేశాల నుంచి సరఫరాలు పెరిగినా, రష్యా చమురు దిగుమతులు 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత అత్యధిక స్థాయికి చేరాయి. కెప్లర్ నివేదిక ప్రకారం జులైలో భారత్ ప్రపంచ దేశాల నుంచి రోజుకు 5 మిలియన్ బ్యారెళ్లకు పైగా ముడి చమురును దిగుమతి చేసుకుంది.
జూన్లో రష్యా నుంచి రోజుకు 2.7 మిలియన్ బ్యారెళ్ల చమురు దిగుమతి కాగా, జులైలో అది 2.8 మిలియన్ బ్యారెళ్లకు పెరిగింది. దీంతో భారత్ మొత్తం ముడి చమురు దిగుమతుల్లో రష్యా వాటా 55.5 శాతానికి చేరింది. అదే సమయంలో సౌదీ అరేబియా నుంచి దిగుమతులు కూడా పెరిగాయి. జూన్లో రోజుకు 2.9 లక్షల బ్యారెళ్లగా ఉన్న దిగుమతులు జులైలో 4.2 లక్షల బ్యారెళ్లకు చేరాయి. ఇరాక్, కువైట్ నుంచి సరఫరాలు పునఃప్రారంభం కాగా, యూఏఈ భారత్కు రెండో అతిపెద్ద చమురు సరఫరాదారుగా కొనసాగింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!