

బాలానగర్లో అరెస్టయిన ‘బొల్లా బ్రదర్స్’ గంజాయి దందాకు సంబంధించిన విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ నెల 13న నిందితులను అరెస్టు చేయగా.. రిమాండ్ నివేదికలో కీలక వివరాలను ప్రస్తావించినట్లు సమాచారం. నిందితులు బొల్లా దుర్గాప్రసాద్, కిరణ్, కమలాకర్ అన్నదమ్ములు కాగా.. గంజాయి రవాణాకు ఏడు బైకులు, ఒక కారుతో పాటు అద్దె వాహనాలను ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. పోలీసుల కంటపడకుండా అద్దె వాహనాల నంబర్ ప్లేట్లను తొలగించినట్లు, ఒకసారి ఉపయోగించిన వాహనాన్ని కొంతకాలం తిరిగి ఉపయోగించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇంట్లోకి కొత్త వ్యక్తులు వస్తే దాడి చేసేలా జర్మన్ షెఫర్డ్ జాతి కుక్కలకు శిక్షణ ఇచ్చినట్లు, రక్షణ కోసం ఎయిర్గన్ కూడా ఉంచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. వినియోగదారులతో నేరుగా సంబంధాలు పెట్టుకోకుండా వాట్సాప్ ద్వారా ఆర్డర్లు తీసుకుని, నిర్దేశిత ప్రాంతాల్లో గంజాయిని ఉంచే ‘డెడ్డ్రాప్’ విధానంలో విక్రయాలు సాగించినట్లు అధికారులు తెలిపారు. డిజిటల్ చెల్లింపుల ద్వారా నగదు స్వీకరించినట్లు, ఒడిశాలోని 29 మంది సరఫరాదారుల నుంచి గంజాయి కొనుగోలు చేసి నగరంలో సుమారు 225 మందికి విక్రయించినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు పేర్కొన్నారు.
ఈ కేసులో మొత్తం ఐదుగురిని నిందితులుగా చేర్చినట్లు సమాచారం. బొల్లా బ్రదర్స్కు ప్రధాన అనుచరుడిగా వ్యవహరించిన జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన శ్రీపెరంబుదూరు రాజ్కుమార్ కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు. గతంలో క్యూనెట్ కేసులోనూ అతడు నిందితుడిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 2019లో ఆ కేసులో అరెస్టయిన అనంతరం ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించినప్పటికీ నేరచరిత్ర కారణంగా అవకాశం లభించలేదని రిమాండ్ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. అనంతరం గంజాయి వినియోగానికి అలవాటుపడి, తన స్నేహితుడి ద్వారా బొల్లా దుర్గాప్రసాద్ నుంచి గంజాయి కొనుగోలు చేయడం ప్రారంభించినట్లు తెలుస్తోంది. స్నేహితుడు 2022లో రోడ్డు ప్రమాదంలో మరణించడంతో రాజ్కుమార్ నేరుగా దుర్గాప్రసాద్తో సంబంధాలు కొనసాగించినట్లు సమాచారం. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో గంజాయి సరఫరా చేయడాన్ని వృత్తిగా మార్చుకుని, ఒక్కో పొట్లానికి రూ.50 చొప్పున కమీషన్ తీసుకునేవాడని అధికారులు పేర్కొన్నారు. ఈ ఏడాది జులైలో నారాయణపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిన్గా ఉద్యోగంలో చేరినప్పటికీ.. ఈ నెల 12న బేగంపేట ఓల్డ్ ఎయిర్పోర్టు రోడ్డులో గంజాయి కొనుగోలుకు వెళ్లిన సమయంలో ఈగల్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అతడిని విచారించడంతో ‘బొల్లా బ్రదర్స్’ గంజాయి నెట్వర్క్కు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!