

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కు తెలంగాణలో కొత్త గనులు కేటాయించకపోవడంతో ఇతర రాష్ట్రాల్లో గనులు కొనుగోలు చేసేందుకు ముందడుగు వేసింది. తాజాగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ‘తార’ బొగ్గు గనిని వేలంలో కొనుగోలు చేయడానికి టెండర్ దాఖలు చేసింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా బొగ్గు గనుల వేలానికి ఆసక్తి వ్యక్తీకరణ ఆహ్వానించగా, తెలంగాణలోని మణుగూరు ఓసీ-2 గనికి కూడా సింగరేణి టెండర్ సమర్పించింది. వచ్చే నెలలో ఈ గనుల వేలం జరగనుంది.
తార గనిలో సుమారు 29.39 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఈ గని లభిస్తే తెలంగాణ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరా సులభమవుతుందని అధికారులు భావిస్తున్నారు. మణుగూరు ఓసీ-2 గని సింగరేణి గనుల సమీపంలో ఉండటంతో ఇది సంస్థకు లాభదాయకమవుతుందని అంచనా. తాడిచర్ల-2, కోయగూడెం గనులను నేరుగా కేటాయించాలని కేంద్రాన్ని సింగరేణి మరోసారి కోరింది. ఈ గనులు లభిస్తే బొగ్గు ఉత్పత్తి మరింత పెరుగుతుందని సంస్థ అభిప్రాయపడుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!