

ఎలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఏఎమ్మార్-ఎస్సెల్బీసీ) ప్రాజెక్టును 2028 జూన్ నాటికి పూర్తిచేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. సోమవారం సచివాలయంలో ఈ ప్రాజెక్టు పురోగతిపై ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. దక్షిణ తెలంగాణకు కీలకమైన ఈ ప్రాజెక్టును పూర్తి చేయడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
సొరంగ పనుల్లో పాల్గొనే కార్మికుల భద్రతపై ఎలాంటి రాజీ ఉండదని మంత్రి పేర్కొన్నారు. నిధుల విడుదల, భూసేకరణ, సాంకేతిక మరియు పరిపాలనా అనుమతులను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. సొరంగ పనులు పునఃప్రారంభం తర్వాత అర కిలోమీటరు వరకు పూర్తయ్యాయి. పనుల్లో వేగం పెంచేందుకు విదేశాల నుంచి మూడు ఆధునిక ఆర్మ్ బూమర్ యంత్రాలు ఈ నెలాఖరులో చేరనున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా 40 టీఎంసీల కృష్ణా జలాలను తీసుకువచ్చి 4.01 లక్షల ఎకరాలకు, 618 ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలకు, పరిశ్రమలకు అందించనున్నారు. డిండి ప్రాజెక్టు, నక్కల గండి రిజర్వాయర్, పెండ్లిపాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కాలువలు పూర్తైతేనే ఈ ప్రాజెక్టు పూర్తి ప్రయోజనం అందుతుందని తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!