

తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూలో నెల రోజుల్లో వరుసగా మూడు చిరుతలు మృతి చెందడం చర్చనీయాంశంగా మారింది. జూలై 28న 16 ఏళ్ల మగ జాగ్వార్ ‘లావా’ మృతి చెందింది. 2017 నుంచి క్యాన్సర్తో బాధపడుతున్న లావాకు చికిత్స అందించినప్పటికీ వ్యాధి చివరి దశకు చేరుకోవడంతో మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్ కారణంగా మృతి చెందినట్లు జూ అధికారులు తెలిపారు. అనంతరం ఆగస్టు 15న సుమారు 17 ఏళ్ల మగ చిరుత ‘సత్య’ మృతి చెందింది. పోస్టుమార్టంలో అస్ఫిక్సియా, తీవ్రమైన రక్తహీనత ఉన్నట్లు నిర్ధారణ అయింది.
ఆగస్టు 28న సుమారు 16 ఏళ్ల ఆడ చిరుత ‘విముడ’ కూడా మృతి చెందింది. గండికోట నుంచి రక్షించిన విముడ 2014 నుంచి తిరుపతి జూలో సంరక్షణలో ఉంది. పోస్టుమార్టంలో ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, తీవ్రమైన గ్యాస్ట్రైటిస్ ఉన్నట్లు గుర్తించారు. మూడు జంతువుల పోస్టుమార్టం నివేదికలను ఉన్నతాధికారులకు పంపినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జూలో 1,153 జంతువులు, పక్షులు సంరక్షణలో ఉన్నాయని, నిపుణులైన వైద్యులు, బయాలజిస్టుల పర్యవేక్షణలో ప్రతిరోజూ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని క్యూరేటర్ వెల్లడించారు. 16–17 ఏళ్ల వయసున్న రెండు చిరుతలు సహజ కారణాలతోనే మృతి చెందినట్లు తెలిపారు. జంతువుల సంరక్షణలో సిబ్బంది నిర్లక్ష్యం జరిగిందన్న ఆరోపణలను ఆయన ఖండించారు. కాంట్రాక్టర్ నుంచి రావాల్సిన మందుల నిల్వలపై ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, బ్యూటాక్స్ సహా అవసరమైన మందులన్నింటినీ అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. మందుల వ్యవహారంపై అంతర్గత విచారణ కొనసాగుతోందని, నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!