

ప్రధాని నరేంద్ర మోదీ ఉజ్బెకిస్థాన్ పర్యటన సందర్భంగా భారతీయులకు ఆ దేశం కీలక శుభవార్త అందించింది. భారత పౌరులకు 30 రోజుల వీసా-ఫ్రీ ప్రయాణ సౌకర్యాన్ని ప్రకటించింది. ఈ నిర్ణయం ఇరు దేశాల మధ్య ప్రజల అనుసంధానం, పర్యాటకం, వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ తెలిపారు. గతేడాది భారత్-ఉజ్బెకిస్థాన్ ద్వైపాక్షిక వాణిజ్యం తొలిసారిగా 1 బిలియన్ డాలర్లను దాటగా.. ఇరు దేశాల మధ్య వారానికి 14 ప్రత్యక్ష విమానాలు నడుస్తున్నాయి. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 5 బిలియన్ డాలర్లకు పైగా పెంచాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
మోదీ, మిర్జియోయెవ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణలు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, యూపీఐ, రక్షణ, ఆరోగ్యం తదితర అంశాలపై చర్చించారు. ఇరు దేశాల సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేలా భారత్-ఉజ్బెకిస్థాన్ సంబంధాలను ‘కాంప్రహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్’గా పెంచేందుకు అంగీకరించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల స్నేహాన్ని బలోపేతం చేయడంలో చేసిన కృషికి గాను మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత విదేశీ పురస్కారం ‘ఒలియ్ దరాజాలి దోస్త్లిక్’ను అధ్యక్షుడు మిర్జియోయెవ్ ప్రదానం చేశారు. ఈ గౌరవాన్ని భారత ప్రజలకు అంకితం చేస్తున్నట్లు మోదీ తెలిపారు. అనంతరం తాష్కెంట్లోని మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి స్మారకాన్ని సందర్శించిన మోదీ పుష్పాంజలి ఘటించారు. 1965 భారత్-పాకిస్థాన్ యుద్ధం అనంతరం తాష్కెంట్ ఒప్పందం కుదిరిన మరుసటి రోజున, 1966 జనవరి 11న లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్లో కన్నుమూశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!