

శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ఏళ్లుగా కొనసాగుతున్న కిడ్నీ వ్యాధుల మూలాలను గుర్తించేందుకు సమగ్ర అధ్యయనం కొనసాగుతోంది. ఈ పరిశోధనలో భాగంగా మొత్తం 5,851 మందిని లక్ష్యంగా తీసుకోగా, ఇప్పటివరకు నాలుగు మండలాల్లో 3,897 మందిని పరీక్షించారు. వీరిలో 949 మందికి కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. ఇది పరీక్షించిన వారిలో 24.35 శాతం. బాధితుల్లో 550 మందికి క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ), మరో 399 మందికి కారణం స్పష్టంగా తెలియని క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీయూ) ఉన్నట్లు తేలింది. అత్యధికంగా కవిటి మండలంలో సీకేడీ, సీకేడీయూ కేసులు నమోదయ్యాయి.
వ్యాధికి గల కారణాలను గుర్తించడంతో పాటు, ముందస్తుగా వ్యాధిని గుర్తించి వైద్య సేవలు అందించడంపై కూడా అధ్యయనం దృష్టి సారించింది. పరిశోధకులు ఇళ్లకు వెళ్లి రక్తం, మూత్రం నమూనాలను సేకరిస్తున్నారు. కిడ్నీ పనితీరు పరీక్షలతో పాటు వ్యాధి ప్రారంభ దశలో కనిపించే బయోమార్కర్లను పరిశీలిస్తున్నారు. ఆర్ఎన్ఏ సీక్వెన్సింగ్, జన్యు అంశాలతో పాటు పర్యావరణ, వృత్తి సంబంధిత కారణాలపైనా పరిశోధన చేస్తున్నారు. భూమి, నీటి నమూనాల్లో పురుగుమందుల అవశేషాలు, భార లోహాలు వంటి అంశాలను కూడా పరీక్షిస్తున్నారు. ఇప్పటివరకు లభించిన మధ్యంతర ఫలితాలను ఐసీఎంఆర్కు పంపించారు. మిగిలిన ప్రాంతాల్లో అధ్యయనం పూర్తయ్యాక, పర్యావరణం మరియు బయోమార్కర్ విశ్లేషణలను కలిపి తుది నిర్ధారణకు రావాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. ఐసీఎంఆర్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ ఆమోదంతో మూడేళ్ల పాటు ఈ పరిశోధన కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!