

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. నందిగ్రామ్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉపఎన్నికలో మమతా బెనర్జీ పోటీ చేస్తే, తాము అభ్యర్థిని నిలబెట్టబోమని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తిరుగుబాటు వర్గం ప్రకటించింది. “మేము కూడా మమతా బెనర్జీ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాము” అని రెబల్ వర్గం నేత, విపక్ష నాయకుడు రీతబ్రత బెనర్జీ పేర్కొన్నారు.
2026 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేత సువేందు అధికారి భవానీపూర్, నందిగ్రామ్ రెండు స్థానాల్లోనూ గెలిచారు. భవానీపూర్లో మమతా బెనర్జీని ఓడించిన ఆయన, నందిగ్రామ్ స్థానానికి రాజీనామా చేయడంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఎన్నికల తర్వాత టీఎంసీలో ఏర్పడిన విభేదాలతో పలువురు ఎమ్మెల్యేలు రీతబ్రత బెనర్జీ నాయకత్వంలో తిరుగుబాటు వర్గంగా ఏర్పడ్డారు.
శనివారం ఢిల్లీలో ఎన్నికల సంఘం అధికారులతో భేటీ అనంతరం రీతబ్రత బెనర్జీ మీడియాతో మాట్లాడారు. తమ అభ్యర్థిని దాదాపు ఖరారు చేసుకున్నప్పటికీ, మమత పోటీ చేస్తే మాత్రం నిలబెట్టబోమని స్పష్టం చేశారు. “మమతా బెనర్జీ సాధారణ ఎన్నికల్లో గెలవరు, కానీ ఉపఎన్నికల్లో గెలుస్తారు. సొంత ప్రాంతంలో ఆమె ఓడిపోవడం బాగుండదు” అని వ్యాఖ్యానించారు. మరో రెబల్ నేత అఖ్రుజ్జమాన్ మాట్లాడుతూ "నందీగ్రామ్కు రండి. మేము అభ్యర్థిని నిలబెట్టం. గెలిచి అసెంబ్లీకి రండి. అభివృద్ధికి కలిసి పనిచేద్దాం" అని మమతకు పిలుపునిచ్చారు.
అయితే, టీఎంసీ పార్టీ పేరు, గుర్తు కోసం ఈ రెండు వర్గాల మధ్య వివాదం ఎన్నికల సంఘం వద్ద కొనసాగుతోంది. ఈ ఆఫర్పై మమతా బెనర్జీ ఇంకా స్పందించలేదు. నందిగ్రామ్, రెజీనగర్ స్థానాలకు అక్టోబర్ 6న పోలింగ్ జరగనుండగా, అక్టోబర్ 9న ఫలితాలు వెలువడనున్నాయి. నామినేషన్ల దాఖలుకు సెప్టెంబర్ 16 చివరి తేదీ.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!