

టాలీవుడ్లో అగ్ర హీరోలు వరుసగా గాయాల బారిన పడుతుండటం చిత్ర పరిశ్రమలో ఆందోళనకు దారితీస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న భారీ యాక్షన్ చిత్రాల కోసం కఠినమైన శిక్షణ, ప్రమాదకర సన్నివేశాల చిత్రీకరణ కారణంగా పలువురు హీరోలు గాయపడుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో వైద్యులను సంప్రదించగా, ఆరు నుంచి ఎనిమిది వారాల విశ్రాంతి అవసరమని సూచించారు. అలాగే పెద్ది చిత్రీకరణలో గాయపడిన రామ్ చరణ్ ఇటీవల మణికట్టుకు శస్త్రచికిత్స చేయించుకోగా, బరి సినిమా కోసం సిద్ధమవుతూ గాయపడిన వరుణ్ తేజ్ చికిత్స అనంతరం కోలుకుంటున్నారు. ఈ పరిణామాలతో పలు భారీ చిత్రాల షూటింగ్ షెడ్యూళ్లు ప్రభావితమవుతున్నాయి.
ఇటీవల బాలకృష్ణ తన 111వ సినిమా చిత్రీకరణలో మోకాలికి గాయపడి శస్త్రచికిత్స చేయించుకోగా, పవన్ కళ్యాణ్ భుజం సమస్యతో ముంబైలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. చిరంజీవి ఈ ఏడాది ప్రారంభంలో భుజానికి శస్త్రచికిత్స అనంతరం పూర్తిగా కోలుకుని కొత్త సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ప్రభాస్ కూడా గతంలో తగిలిన గాయాలకు చికిత్స తీసుకుని ఆరోగ్యంగా తిరిగి పనిలో చేరారు. యాక్షన్ ప్రధాన చిత్రాల్లో సహజత్వం కోసం హీరోలు స్వయంగా కఠినమైన సన్నివేశాలు చేయడం వల్ల ప్రమాదాల ముప్పు పెరుగుతోందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. తమ అభిమాన హీరోలు త్వరగా కోలుకుని మళ్లీ షూటింగ్లలో పాల్గొనాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!