

దేశంలోని అనేక ప్రాంతాల్లో రుతుపవన వర్షాలు సాధారణ స్థాయికంటే 43 శాతం తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 315 వర్షాభావ ప్రభావిత జిల్లాలకు అత్యవసర ప్రణాళికలను సిద్ధం చేసింది. పరిస్థితులను ముందుగానే అంచనా వేసి నష్టాన్ని తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలు అధిక ప్రమాద జాబితాలో ఉన్నాయి.
గుర్తించిన జిల్లాల్లో 111 జిల్లాలను అత్యంత ప్రమాదకరంగా వర్గీకరించగా, అక్కడ సాగుభూమిలో 25 శాతం కన్నా తక్కువ ప్రాంతానికే నీటిపారుదల సౌకర్యం ఉంది. మరో 76 జిల్లాలు మధ్యస్థ ప్రమాద జాబితాలో ఉండగా, 128 జిల్లాల్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉన్నట్లు అంచనా వేశారు. వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు అదనపు విత్తన నిల్వలు, ఎరువుల సరఫరా పర్యవేక్షణ, చెక్డ్యాంలు మరియు వ్యవసాయ చెరువుల నిర్మాణం వేగవంతం చేస్తున్నారు. రైతులు తక్కువ నీటితో పండే చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల సాగు వైపు మళ్లాలని సూచిస్తున్నారు. ఐసీఏఆర్ మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూపొందించిన అత్యవసర ప్రణాళికల్లో పంటల మార్పిడి, ప్రత్యామ్నాయ సాగు విధానాలు, నీటి సంరక్షణ చర్యలు ఉన్నాయి. ఎల్నినో ప్రభావాన్ని కేంద్రం నిరంతరం పర్యవేక్షిస్తూ పరిస్థితులను సమీక్షిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!