

నషా ముక్త్ భారత్ ద్వారానే వికసిత్ భారత్ సాధ్యమని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. దేశాన్ని మాదకద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దడం ప్రతి పౌరుడి బాధ్యత అని ఆయన అన్నారు. గ్రామాలు, రాష్ట్రాలు వ్యసనాల నుంచి విముక్తి పొందినప్పుడే దేశం నిజమైన అభివృద్ధి సాధిస్తుందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ‘నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్’ కార్యక్రమాన్ని గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ ఆడిటోరియంలో యువతతో కలిసి గవర్నర్ వీక్షించారు.
ఈ సందర్భంగా తెలంగాణలో ‘10 కోట్ల డ్రగ్-ఫ్రీ ప్రతిజ్ఞ ఉద్యమం’కు శ్రీకారం చుట్టి యువత, విద్యార్థులతో యాంటి డ్రగ్ ప్రతిజ్ఞ చేయించారు. దేశ జనాభాలో 65 శాతం యువత ఉన్న నేపథ్యంలో వారిని వ్యసనాల నుంచి కాపాడటం అత్యంత ముఖ్యమని ఆయన తెలిపారు. ఆరోగ్యకర జీవనం, క్రమశిక్షణ, అవగాహనతోనే సమాజం ముందుకు సాగుతుందని పేర్కొంటూ యోగా, క్రీడలు, నైతిక విలువలను అలవరచుకోవాలని సూచించారు. మై భారత్ వేదిక ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వ్యసన రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!