

వారణాసిలో నిర్వహించిన వారణాసి–వడ్నగర్ సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు హిందీలో ప్రసంగిస్తూ.. కాశీ పవిత్ర భూమిపై నిలబడటం తనకు గర్వకారణమని అన్నారు. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి దేశానికి ఒక నాయకుడిని అందించిందని పేర్కొన్నారు. మోదీ పాలనలో పేదరిక నిర్మూలన, ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ, తాగునీటి సదుపాయాలు, పీఎం కిసాన్ వంటి పథకాల ద్వారా ప్రజలకు ప్రయోజనం కలిగిందని చంద్రబాబు అన్నారు. ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా విధానాలతో భారత్ రక్షణ రంగంలో దిగుమతుల నుంచి ఎగుమతుల దిశగా ఎదిగిందని పేర్కొన్నారు. స్టార్టప్లు, అంతరిక్షం, డ్రోన్లు, సెమీకండక్టర్లు, క్వాంటమ్ టెక్నాలజీ, రోబోటిక్స్ రంగాల్లో యువతకు అవకాశాలు పెరిగాయని తెలిపారు.
మహిళా సాధికారత కోసం కేంద్రం చేపట్టిన పథకాలను కూడా చంద్రబాబు ప్రస్తావించారు. నారీ శక్తి అధినియం ద్వారా చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చర్యను ప్రస్తావిస్తూ, ఇది కీలకమైన మార్పుగా అభివర్ణించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ తన రక్షణ సామర్థ్యాన్ని చాటుకుందని, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను అభినందిస్తున్నానని అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తయిందని పేర్కొంటూ, అక్కడ శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం 10 ఎకరాలు కేటాయించాలని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ను కోరనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా నదుల అనుసంధానం, ముఖ్యంగా బ్రహ్మపుత్ర, గంగా, మహానది, కావేరి, గోదావరి నదులను అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్డీఏ భాగస్వామ్యాన్ని ఏపీ బలోపేతం చేస్తోందని, అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులకు కేంద్రం అందిస్తున్న సహకారాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తుంచుకుంటారని చంద్రబాబు అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!