

పారిస్లోని ఈఫిల్ టవర్ వద్ద బీఏపీఎస్ ప్రతినిధుల పర్యటన సందర్భంగా తలెత్తిన వివాదంపై భారత్ స్పందించింది. ఈ వ్యవహారం సంబంధిత సంస్థల మధ్య అంశమని, దీనిపై భారత ప్రభుత్వం ఎలాంటి వ్యాఖ్యలు చేయబోదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పారిస్ ప్రాంతంలో కొత్తగా నిర్మించిన బీఏపీఎస్ హిందూ ఆలయ ప్రారంభోత్సవం గురించి తమకు తెలుసని, అయితే ఈఫిల్ టవర్ వివాదం మాత్రం సంబంధిత వర్గాల మధ్య విషయమని తెలిపారు.
బీఏపీఎస్ ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో భాగంగా సంస్థకు చెందిన సుమారు 100 మంది ప్రతినిధులు ఈఫిల్ టవర్ను సందర్శించారు. ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులను విధుల నుంచి తప్పించి, కొన్ని ప్రాంతాలకు వెళ్లకుండా ఆదేశించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై పారిస్ మేయర్ ఎమ్మాన్యుయెల్ గ్రెగ్వార్ దర్యాప్తు ప్రారంభిస్తామని ప్రకటించారు. వివాదంపై బీఏపీఎస్ క్షమాపణలు చెబుతూ, పెద్ద సంఖ్యలో ప్రతినిధులు రావడంతో ఇతర సందర్శకులకు ఇబ్బంది కలగకుండా ఈ పర్యటనను ముందుగానే సమన్వయం చేసుకున్నామని తెలిపింది. మహిళలపై లింగ వివక్ష చూపాలనే ఉద్దేశం తమకు లేదని, ఎవరినీ ఈఫిల్ టవర్లోకి రాకుండా అడ్డుకోలేదని స్పష్టం చేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!