

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో వార్షిక పవిత్రోత్సవాలు నేటి నుంచి శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి. ఆలయంలో నిత్య కైంకర్యాలు, అర్చనలు, పూజల సమయంలో తెలిసీ తెలియక జరిగే దోషాలు, స్పర్శ దోషాలు, లోపాలు, అశుచులు తొలగిపోయి ఆలయ పవిత్రత పరిపూర్ణంగా నిలవాలనే ఉద్దేశంతో ఏటా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.
రంగురంగుల పట్టు దారాలతో రూపొందించిన పవిత్ర మాలలను ప్రధాన దేవతలు, పరివార దేవతలకు సమర్పించి, వివిధ హోమాలు, జపాలు, మూలమంత్ర హవనాలు నిర్వహించనున్నారు. నేటి తెల్లవారుజామున 3 గంటలకు శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో సుప్రభాత సేవ, అనంతరం స్నపనాభిషేకం, పవిత్ర మాలాధారణ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ క్రతువులు పూర్తయ్యే వరకు దర్శనాలు నిలిపివేసి, ఉదయం 8 గంటల తర్వాత భక్తులకు సర్వదర్శనం కల్పించనున్నారు.
మూడు రోజుల పాటు జరిగే పవిత్రోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ మధ్యాహ్నం పూజా కార్యక్రమాల సమయంలో దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేస్తారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు మూలమంత్ర హవనాలు, వేద పారాయణాలు, నీరాజన మంత్రపుష్పాలు నిర్వహిస్తారు. ఈ మూడు రోజులు ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. భక్తులు దర్శన సమయాలు, ఆన్లైన్ టికెట్లకు సంబంధించిన వివరాలను దేవస్థానం అధికారిక వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. ఉత్సవాల అనంతరం అమ్మవారికి సమర్పించిన పవిత్ర మాలలను భక్తులకు ప్రసాదంగా అందించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!