

హైదరాబాద్ పాతనగరంలో మెట్రో రైలు విస్తరణ పనులను వేగవంతం చేయాలని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బి. అజిత్రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం దారుష్షిఫా నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల పరిధిలో జరుగుతున్న రహదారి విస్తరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ మార్గంలో ప్రభావితమవుతున్న 888 ఆస్తుల్లో ఇప్పటికే 833 ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వివరించారు. మిగిలిన 55 ఆస్తుల్లో ఉన్న వారసత్వ కట్టడాలు, పురాతన భవనాల విషయంలో తీసుకుంటున్న చర్యలపై ఆయన సమీక్షించారు.
మెట్రో మార్గానికి అడ్డంకిగా ఉన్న విద్యుత్ తీగలు, స్తంభాలు, నీటి సరఫరా పైపులు తదితర మౌలిక వసతులను సురక్షితంగా తరలించే పనులను మరింత వేగవంతం చేయాలని అజిత్రెడ్డి సూచించారు. భూసేకరణ పూర్తైన ప్రాంతాల్లో ప్రభావిత ఆస్తుల తొలగింపును త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేసి రైట్ ఆఫ్ వేను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పాతనగరం మెట్రో పనులను వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!