

భవిష్యత్లో చంద్రుడిపై మానవ నివాసాల నిర్మాణానికి అవసరమైన సాంకేతికత అభివృద్ధి దిశగా అమెరికాలోని డెలావేర్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. భూమి నుంచి సిమెంట్, నీరు, నిర్మాణ సామగ్రిని చంద్రుడికి తరలించడం అత్యంత ఖరీదైన ప్రక్రియ కావడంతో, అక్కడ లభించే రెగోలిథ్ (చంద్రుడి మట్టి)ను ఉపయోగించి నిర్మాణ పదార్థాలను తయారు చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందుకోసం చంద్రుడి మట్టిని పోలిన కృత్రిమ పదార్థాలను ఆల్కలైన్ ద్రావణంతో కలిపి జియోపాలిమర్ ఆధారిత నిర్మాణ నమూనాలను రూపొందించారు. అంగారకుడి మట్టిని పోలిన ప్రత్యేక నమూనాను కూడా అభివృద్ధి చేశారు.
ఈ నాలుగు నమూనాలను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) వెలుపల ఆరు నెలల పాటు ఉంచి శూన్య వాతావరణం, రేడియేషన్, తీవ్రమైన ఉష్ణోగ్రత మార్పులను ఎదుర్కొనేలా పరీక్షించారు. అనంతరం వాటిని భూమికి తీసుకొచ్చి పరిశీలించగా, మెటాకావోలిన్ నమూనా మినహా మిగిలిన మూడు నమూనాల్లో ఎలాంటి క్షీణత కనిపించలేదు. అంతేకాకుండా ఒక లూనార్ రెగోలిథ్ నమూనా భూమిపై ఉంచిన నమూనాతో పోలిస్తే 35 శాతం అధిక బలాన్ని ప్రదర్శించింది. అయితే ఈ అదనపు బలం అంతరిక్ష ప్రభావం వల్ల కాకుండా ప్రయోగానికి ముందు నిర్వహించిన బేకౌట్ పరీక్ష కారణమని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పరిశోధన భవిష్యత్ చంద్ర నిర్మాణాలకు కీలక మైలురాయిగా భావిస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!