

సోషల్ మీడియాలో పెద్ద సంఖ్యలో ఫాలోవర్లను కలిగి విదేశీ ఉద్యోగాలు, జీవనశైలికి సంబంధించిన విషయాలను చెప్పే యూట్యూబర్ రమానందన్, ఆమె భర్త మధుకర్పై మోసాలకు సంబంధించిన ఆరోపణలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఫేక్ వీసాలు, విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పలువురిని మోసం చేశారనే ఆరోపణలపై విజయవాడ, ఇబ్రాహీంపట్నం, బాపట్ల జిల్లా అద్దంకి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు సమాచారం. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ బాధితుడు విడుదల చేసిన వీడియోలో రమానందన్ దంపతులపై పలు ఆరోపణలు చేశాడు. యూకేలో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ‘నందూస్ కిచెన్’లో మూడేళ్ల స్పాన్సర్షిప్ కోసం తన నుంచి భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నారని అతడు ఆరోపించాడు.
యూకేకు వెళ్లిన ఏడాది తర్వాత నిబంధనల ఉల్లంఘన కారణంగా రెస్టారెంట్ మూసివేశారని, అనంతరం కొన్ని నెలలపాటు జీతాలు కూడా చెల్లించలేదని బాధితుడు పేర్కొన్నాడు. తనలాంటి పలువురు యువకులు డబ్బుతో పాటు విలువైన సమయాన్ని కూడా కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశాడు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగేందుకు బాధితులు ఇంటికి వచ్చినప్పుడు రమానందన్ తన భర్త మధుకర్ను బాత్రూమ్లో దాచేవారని కూడా అతడు ఆరోపించాడు. ఏపీ, తెలంగాణ పోలీసులు ఈ వ్యవహారంపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం చేయడంతో పాటు, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరాడు. ఈ ఆరోపణలపై సంబంధిత వ్యక్తుల స్పందన వెల్లడికావాల్సి ఉంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!