

పుణెలో జరిగిన ‘ఫెస్టివల్ ఆఫ్ థింకర్స్’ కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రహదారి నిర్మాణంపై తన అభిప్రాయాలను వెల్లడించారు. తాను నిర్మించిన ముంబయి-పుణె ఎక్స్ప్రెస్వే 27 ఏళ్లుగా అత్యుత్తమ స్థితిలో ఉందని, ఇప్పటికీ గుంతలు లేకుండా ప్రయాణికులకు సేవలందిస్తోందని అన్నారు. అయితే ఈ సానుకూల అంశంపై మీడియా పెద్దగా కథనాలు రాయడం లేదని వ్యాఖ్యానించారు. ఇటీవల ఎక్స్ప్రెస్వే కొత్త ‘మిస్సింగ్ లింక్’ ప్రాజెక్టులో కొండచరియలు విరిగిపడి నిర్మాణానికి నష్టం జరిగిన ఘటనపై తనపై సోషల్ మీడియాలో విమర్శలు, ట్రోలింగ్ జరిగాయని గడ్కరీ పేర్కొన్నారు. అయితే ఆ ప్రత్యేక నిర్మాణం మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదని వివరించారు.
సోషల్ మీడియా కొన్నిసార్లు రహదారుల నాణ్యతను పర్యవేక్షించే సాధనంగా పనిచేస్తుందని గడ్కరీ అన్నారు. రహదారుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు కృత్రిమ మేధస్సు, డ్రోన్లు వంటి ఆధునిక సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించాలని సూచించారు. సమస్యలను ముందుగానే గుర్తించి మరమ్మతులు చేపట్టడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. దేశ ఆర్థికాభివృద్ధికి మౌలిక వసతులు కీలకమని, తాత్కాలిక పరిష్కారాల కంటే 25 నుంచి 50 ఏళ్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రహదారుల ప్రణాళిక, నిర్మాణం చేపట్టాలని గడ్కరీ సూచించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!