

ప్రాణహిత నదిపై తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక, అంతర్రాష్ట్ర అంశాలపై సెప్టెంబర్ 1న ఢిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జల సంఘం (CWC) చైర్మన్ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సేవా భవన్లో జరిగే ఈ భేటీలో తెలంగాణ, మహారాష్ట్ర జలవనరుల శాఖల ఉన్నతాధికారులు పాల్గొంటారు. ప్రాజెక్టుకు సంబంధించిన సాంకేతిక అంశాలు, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలపై సమావేశంలో చర్చించనున్నారు. ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి చేస్తున్న వరుస ప్రయత్నాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
తుమ్మిడిహట్టి బ్యారేజ్ ఎత్తును గతంలో మహారాష్ట్ర అంగీకరించిన 148 మీటర్లకు బదులుగా 152 మీటర్లకు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 148 మీటర్ల వద్ద అవసరమైన నీటిని గ్రావిటీ ద్వారా తరలించడం సాధ్యం కాదని, భారీ పంపులను వినియోగిస్తే విద్యుత్ వ్యయం గణనీయంగా పెరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి వివరించింది. నీటిమట్టాన్ని పెంచడం ద్వారా తక్కువ విద్యుత్ వ్యయంతో ప్రాజెక్టును దీర్ఘకాలికంగా ప్రయోజనకరంగా నిర్వహించవచ్చని పేర్కొంది. నీటిమట్టం పెంపుతో అదనపు ముంపు పరిమితంగానే ఉంటుందని అధ్యయనాలు సూచిస్తున్నాయని తెలిపింది. కరవు, వెనుకబడిన ప్రాంతాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో కేంద్రం, మహారాష్ట్రతో తెలంగాణ ప్రభుత్వం సంప్రదింపులు కొనసాగిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!