

తెలంగాణ నీటిపారుదల, ఆహార, పౌరసరఫరాల శాఖల మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి న్యూఢిల్లీలో ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయిని కలిసి సమ్మక్క సాగర్ ప్రాజెక్టు, సమ్మక్క సారక్క బ్యారేజీకి త్వరగా నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) జారీ చేయాలని కోరారు. బ్యారేజీలో పూర్తి స్థాయి నీటిని నిల్వ చేసుకునేందుకు ఛత్తీస్గఢ్ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు కారణంగా ఆ రాష్ట్రంలో ముంపునకు గురయ్యే భూములు, ఇళ్లకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి నష్టపరిహారం చెల్లిస్తుందని ఉత్తమ్ హామీ ఇచ్చారు.
ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద గోదావరిపై నిర్మించిన ఈ బ్యారేజీకి 6.94 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉంది. సాగునీటి అవసరాల కోసం గోదావరి నుంచి 46.96 టీఎంసీల నీటిని మళ్లించడం ప్రాజెక్టు లక్ష్యం. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు రెండో దశ కింద 4.40 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతో పాటు, రామప్ప–పాకాల అనుసంధాన కాలువ కింద మరో 30 వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. బ్యాక్వాటర్ ప్రభావంపై అధ్యయనం కోసం తెలంగాణ ఇప్పటికే ఛత్తీస్గఢ్కు రూ.9.883 కోట్లు చెల్లించింది. పరిహార నిధులను ముందుగానే జమ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఉత్తమ్ తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!