

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో జరిగిన జనసేన నవనిర్మాణ సభ వివాదం ముందస్తుగా ప్రణాళికాబద్ధంగా జరిగినది కాదని స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలనే సభను అడ్డుకున్నారని తాను భావించడం లేదన్నారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, అనుమతి లభించి ఉంటే సభ సాధారణంగానే జరిగిపోయేదని, అనవసర వివాదాలు తలెత్తేవి కాదన్నారు. తెలంగాణలో జనసేన నాయకులు అక్కడి భూమిపుత్రులేనని, వారికీ రాజకీయంగా పోటీ చేసే హక్కు ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ఎవరి జాగీరు కాదన్న తన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కాదని, ఇతరులను రాజకీయంగా అడ్డుకునే నాయకులను ఉద్దేశించిందేనని వివరించారు.
కాంగ్రెస్ నాయకులు విద్వేషపూరిత వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని పవన్ కళ్యాణ్ సూచించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో తనకు సోదర భావం ఉందని, ఆయన తప్పుగా మాట్లాడి ఉండరని అన్నారు. సమాజంలో కుల విద్వేషాలు పెరగకుండా చూడాల్సిన అవసరం ఉందని, వాటికి వ్యతిరేకంగా జనసేన సేనాగళం ద్వారా పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. అలాగే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి కొత్త రాజధాని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయన, మూడు జిల్లాలకు రాజధాని అవసరమేంటని, అది రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమేనా అని వ్యాఖ్యానించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!