

కొత్తగా ఇల్లు తీసుకున్న వారు, అద్దెకు మారిన కుటుంబాలు, కొత్తగా పెళ్లైన జంటలు ఎల్పీజీ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్నా.. అనేక ప్రాంతాల్లో అవి పెండింగ్లోనే ఉంటున్నాయి. అంతర్జాతీయ ఇంధన సరఫరాలపై ఒత్తిడి, ముఖ్యంగా పశ్చిమాసియా పరిణామాల నేపథ్యంలో చమురు సంస్థలు ప్రస్తుతం ఉన్న వినియోగదారుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో కొత్త డొమెస్టిక్ ఎల్పీజీ కనెక్షన్లు, అదనపు సిలిండర్ల కేటాయింపులు తాత్కాలికంగా పరిమితమయ్యాయి. కమర్షియల్ సిలిండర్ల సరఫరా మాత్రం కొనసాగుతోంది.
భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో గణనీయమైన భాగాన్ని దిగుమతుల ద్వారా తీర్చుకుంటోంది. అంతర్జాతీయ సరఫరా మార్గాల్లో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉండటంతో కేంద్రం ముందస్తు చర్యలు చేపట్టింది. దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని రిఫైనరీలు, చమురు సంస్థలను ఆదేశించింది. ప్రభుత్వ, ప్రైవేట్ రిఫైనరీలు, అప్స్ట్రీమ్ సంస్థలు కలిసి రోజుకు 63,810 టన్నుల వరకు ఎల్పీజీ ఉత్పత్తి సామర్థ్యాన్ని సిద్ధంగా ఉంచేలా లక్ష్యాన్ని నిర్దేశించింది. దేశంలో రోజువారీ ఎల్పీజీ వినియోగం 90 వేల టన్నులకు పైగా ఉన్న నేపథ్యంలో నిల్వలపైనా దృష్టి సారించింది.
ఇండేన్, భారత్గ్యాస్, హెచ్పీ గ్యాస్ డీలర్ల ప్రకారం.. ప్రస్తుతం ఉన్న వినియోగదారులకు సిలిండర్ల సరఫరా సజావుగా కొనసాగించడమే ప్రధాన ప్రాధాన్యత. అందుకే కొత్త డొమెస్టిక్, డబుల్ సిలిండర్ కనెక్షన్లను తాత్కాలికంగా పరిమితం చేస్తున్నారు. ఒకే చిరునామాలో ఉన్న బహుళ కనెక్షన్లను గుర్తించే ప్రక్రియ కూడా కొనసాగుతోంది. కొత్త కనెక్షన్ల పునఃప్రారంభ తేదీని చమురు సంస్థలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అంతర్జాతీయ సరఫరాలు మెరుగుపడి, దేశీయ నిల్వలు స్థిరపడిన తర్వాత దశలవారీగా కొత్త కనెక్షన్లు మళ్లీ ఇచ్చే అవకాశం ఉందని రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. దరఖాస్తుదారులు ఆధార్, చిరునామా ధ్రువీకరణ పత్రాలను సిద్ధంగా ఉంచుకుని, సమీప గ్యాస్ ఏజెన్సీ వద్ద తమ దరఖాస్తు స్థితిని తెలుసుకోవాలని సూచిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!