

రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. అమరావతిని ప్రజా రాజధానిగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం అభివృద్ధి పనులను వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం సీడ్ యాక్సిస్ ఇ-3 రహదారితో పాటు నూతనంగా నిర్మించిన స్టీల్ బ్రిడ్జీలను అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాజధాని ప్రాంత రైతులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రహదారిని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన రాజధాని పనులను తిరిగి వేగవంతం చేశామని, రైతుల త్యాగాలు వృథా కావని హామీ ఇచ్చారు.
ఆధునిక సాంకేతికతతో నిర్మించిన స్టీల్ బ్రిడ్జీలు, కనెక్టివిటీ రహదారులు అమరావతి అభివృద్ధికి మరింత ఊపునిస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, పి. నారాయణ, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ భాష్యం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వెంట నడుస్తూ మంత్రులు, అధికారులు ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను వివరించారు. రాజధాని నిర్మాణ పనులు మళ్లీ వేగం పుంజుకోవడంపై స్థానిక రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!