

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర త్వరలోనే దేశంలోనే అత్యుత్తమ ప్రాంతంగా ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఎర్రబస్సు కూడా రాని ప్రాంతానికి నేడు అంతర్జాతీయ విమానాశ్రయం రావడం అభివృద్ధికి నిదర్శనమన్నారు. గత రెండేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో ఉత్తరాంధ్రకు రూ.6.13 లక్షల కోట్ల పెట్టుబడులు, 189 ప్రాజెక్టులు వచ్చాయని, వాటి ద్వారా 5.57 లక్షల మందికి ఉపాధి లభించనుందని తెలిపారు. గూగుల్, ఆర్సెలార్ మిత్తల్, సెమీకండక్టర్ ప్రాజెక్టులు, సాగునీటి పథకాలు, గోదావరి–వంశధార అనుసంధానం వంటి ప్రాజెక్టులు ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చనున్నాయని చెప్పారు.
విశాఖ ఉక్కు, రైల్వే జోన్, పోలవరం, అమరావతి, పారిశ్రామికాభివృద్ధి వంటి కీలక అంశాల్లో ప్రధాని మోదీ రాష్ట్రానికి విశేష సహకారం అందించారని చంద్రబాబు పేర్కొన్నారు. 2027 నాటికి పోలవరాన్ని, 2028 నాటికి అమరావతి తొలి దశను పూర్తి చేసి ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని వెల్లడించారు. భోగాపురం విమానాశ్రయం తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్మించబడిందని, దీనికి భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. థింసా నృత్యంతో ప్రపంచ రికార్డులు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ, ఉత్తరాంధ్ర భవిష్యత్తు స్వర్ణయుగాన్ని ఆహ్వానిస్తోందన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!