

కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు అనుమతుల వ్యవహారంపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. విదేశీ పర్యటనలకు సీఎం, కేంద్రమంత్రి స్థాయి వ్యక్తులు ముందుగా అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే పర్యటనలను ఖరారు చేసుకుంటారని చెప్పారు. విదేశీ వ్యవహారాల శాఖ నిబంధనలు ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చినవి కాదని, స్వాతంత్ర్యం తర్వాత నుంచే అమల్లో ఉన్నాయని తెలిపారు. రేవంత్ రెడ్డికి గతంలో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పర్యటనతో పాటు లండన్ పర్యటనలకు కూడా అనుమతులు ఇచ్చిన విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. అమెరికా పర్యటనకు అనుమతి లభించని అంశాన్ని కేంద్రంపై నెపం నెట్టేందుకు ఉపయోగించుకోవడం సరికాదని విమర్శించారు.
విదేశీ పర్యటనలకు అనుమతులు ఇచ్చే సమయంలో ఆయా సమావేశాల్లో పాల్గొనే వ్యక్తుల స్థాయి, వారి నేపథ్యం, దేశ ప్రయోజనాలు, విదేశాంగ విధానానికి సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని కిషన్ రెడ్డి వివరించారు. రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ విద్యా వ్యవస్థ, కుల గణన వంటి అంశాలపై కూడా సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యారంగానికి 15 శాతం నిధులు, విద్యార్థులకు స్కూటీలు, విద్యా భరోసా కార్డులు, ప్రతి మండలానికి అంతర్జాతీయ పాఠశాల వంటి హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. తెలంగాణ కుల గణనలో ప్రభుత్వం విఫలమైందని, కేంద్రం శాస్త్రీయ పద్ధతిలో జనగణనతో పాటు కుల గణన చేపడుతోందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!