

ఉత్తర్ప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లు పైబడిన మహిళలకు రాష్ట్ర రవాణా సంస్థ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించే పథకానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ‘లోకమాత అహిల్యాబాయి మాతృశక్తి యోజన’ పేరుతో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి దయాశంకర్ సింగ్ వెల్లడించారు. వచ్చే ఏడాది ఉత్తర్ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
రాష్ట్ర రవాణా శాఖకు చెందిన అన్ని బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులో ఉంటుందని మంత్రి తెలిపారు. ఆధార్ కార్డు లేదా ఓటర్ ఐడీ చూపించి అర్హులైన మహిళలు ప్రయాణించవచ్చని చెప్పారు. ఈ పథకం ద్వారా సుమారు కోటి మంది మహిళలకు ప్రయోజనం చేకూరుతుందని, ప్రభుత్వం ప్రతి నెలా రూ.22.50 కోట్లను ఖర్చు చేయనుందని వెల్లడించారు. ఇదిలా ఉండగా, రక్షాబంధన్ సందర్భంగా ఆగస్టు 27 ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 29 అర్ధరాత్రి వరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!