

ఆంధ్రప్రదేశ్లో నవోదయ విద్యాలయాలు లేని 13 జిల్లాల్లో కొత్త జవహర్ నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయడంతోపాటు రాష్ట్రంలో మరో రెండు ఎయిమ్స్లను ఏర్పాటు చేసేందుకు అవసరమైన బడ్జెట్ సహాయం అందించాలని రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 28 జిల్లాలు ఉండగా, 15 జిల్లాల్లో మాత్రమే నవోదయ విద్యాలయాలు పనిచేస్తున్నాయని తెలిపారు.
గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన రెసిడెన్షియల్ విద్య అందించడంలో నవోదయ విద్యాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని రమేశ్ పేర్కొన్నారు. మిగిలిన 13 జిల్లాల్లో జేఎన్వీల ఏర్పాటుకు సుమారు రూ.1,096 కోట్ల నిధులు అవసరమవుతాయని తెలిపారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ, గిరిజన ప్రాంతాల వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరో రెండు ఎయిమ్స్లను ఏర్పాటు చేయాలని కోరారు. వీటి కోసం సాధ్యాసాధ్యాల అధ్యయనం, డీపీఆర్ తయారీకి ప్రారంభ నిధులు కేటాయించి, అనంతరం అవసరమైన మూలధన నిధులు విడుదల చేయాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!