

బీఆర్ఎస్ పాలనలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గనులు, గ్రానైట్ అక్రమాలపై సీఐడీ దర్యాప్తునకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. 2014 నుంచి 2023 వరకు కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరగనుంది. ఈ విచారణలో మాజీ మంత్రులు, గనుల రంగానికి సంబంధం ఉన్న ప్రముఖుల పాత్రపై కూడా పరిశీలన జరిగే అవకాశముందనే ప్రచారం సాగుతోంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా గ్రానైట్ పరిశ్రమకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. అయితే గతంలో జరిగిన విజిలెన్స్ విచారణలో 320 గ్రానైట్ సంస్థలు సుమారు రూ.125 కోట్ల సీనరేజీ పన్నును ఎగవేసినట్లు గుర్తించారు. అనంతరం జరిమానాను ఐదు రెట్లు పెంచి సుమారు రూ.750 కోట్ల చెల్లింపుల కోసం నోటీసులు జారీ చేశారు. గతంలో 10 కేసులు నమోదు చేసి రూ.6.16 కోట్ల జరిమానా కూడా విధించారు. అయితే తర్వాత కేవలం రూ.11 కోట్ల చెల్లింపుతో వ్యవహారం ముగిసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గ్రానైట్ అక్రమాలపై కేంద్ర సంస్థలు కూడా గతంలో విచారణ చేపట్టాయి. ఎనిమిది గ్రానైట్ సంస్థల్లో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మరోవైపు అక్రమ తవ్వకాల కారణంగా జిల్లాలో 700కు పైగా గుట్టలు కనుమరుగయ్యాయని, మరో 800 గుట్టలు ప్రమాదంలో ఉన్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా సీఐడీ దర్యాప్తు అక్రమాలపై చర్యలకు దారితీస్తుందా లేదా గత విచారణల మాదిరిగానే పరిమితమవుతుందా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!