

యూపీఐ సహా ఎంపిక చేసిన డిజిటల్ చెల్లింపులపై భవిష్యత్తులో మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) రుసుము విధించే అవకాశానికి మార్గం సుగమమైంది. దీనికి సంబంధించిన పన్నులు, ఇతర చట్టాలు (సవరణ) బిల్లు–2026కు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ సవరణలతో బ్యాంకులు, చెల్లింపుల సేవా సంస్థలు నిర్దేశిత ఎండీఆర్ రుసుమును వసూలు చేసే అవకాశం కలగనుంది. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను దీర్ఘకాలికంగా బలోపేతం చేయడం, బ్యాంకులు మరియు ఫిన్టెక్ సంస్థలకు స్థిరమైన ఆదాయ వనరులు కల్పించడమే ఈ నిర్ణయం వెనుక ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
అయితే ఈ ఎండీఆర్ రుసుము వినియోగదారులపై కాకుండా వ్యాపారులపైనే ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. రూ.2,000లోపు యూపీఐ లావాదేవీలు, వ్యక్తుల మధ్య జరిగే వ్యక్తిగత నగదు బదిలీలపై ఎలాంటి ఛార్జీలు ఉండవు. రూ.1.5 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ కలిగిన పెద్ద వ్యాపార సంస్థల్లో రూ.2,000కు మించిన చెల్లింపులపై మాత్రమే 0.3 నుంచి 0.5 శాతం వరకు ఎండీఆర్ విధించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశంపై తుది నిర్ణయం మాత్రం ఇంకా ఎన్పీసీఐ ఆధ్వర్యంలోని యూపీఐ అండ్ సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ తీసుకోవాల్సి ఉంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!