

దేశంలో హైస్పీడ్ రైళ్లు, బుల్లెట్ ట్రైన్ కోసం ప్రయాణికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ.. తమిళనాడులోని నీలగిరి మౌంటెన్ రైల్వే మాత్రం తన నెమ్మదైన ప్రయాణంతోనే పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. మెట్టుపాళ్యం నుంచి ఉదగమండలం (ఊటీ) వరకు నడిచే ఈ హెరిటేజ్ రైలు సుమారు 46 కి.మీ. ప్రయాణానికి దాదాపు ఐదు గంటల సమయం తీసుకుంటుంది. దట్టమైన అడవులు, పొగమంచుతో కప్పుకొనే కొండలు, సొరంగాలు, వంతెనలు, పచ్చని తేయాకు తోటల మధ్య సాగే ప్రయాణం ప్రకృతి ప్రేమికులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. షారుక్ ఖాన్ నటించిన ‘దిల్ సే’ చిత్రంలోని సూపర్ హిట్ ‘ఛయ్య ఛయ్య’ పాటతోనూ ఈ రైల్వే మార్గం సినీ ప్రేక్షకులకు సుపరిచితమే.
నీలగిరి పర్వతాల్లోని ఎత్తుపల్లాలు, మలుపులు, సొరంగాలు, వంతెనలతో కూడిన క్లిష్టమైన మార్గం కారణంగా ఈ రైలు చాలా నెమ్మదిగా ప్రయాణిస్తుంది. అయితే అదే ప్రయాణికులకు చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను ఆస్వాదించే అవకాశాన్ని కల్పిస్తోంది. 1900ల ప్రారంభం నుంచి సేవలందిస్తున్న ఈ చారిత్రక రైల్వే ‘మౌంటెన్ రైల్వేస్ ఆఫ్ ఇండియా’లో భాగంగా యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందింది. వింటేజ్ అనుభూతి, చారిత్రక ఇంజినీరింగ్ ప్రత్యేకతలు, నీలగిరుల ప్రకృతి సౌందర్యం కారణంగా దేశ, విదేశీ పర్యాటకులకు ఈ రైలు ప్రయాణం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!