

వ్యవసాయంలో రైతన్నకు తోడుగా నిలిచే పశుసంపదపై ఉన్న ప్రేమకు పొలాల అమావాస్య ప్రతీకగా నిలుస్తోంది. ప్రకృతి, పశుపక్ష్యాదులు, పంచభూతాలను వ్యవసాయంలో భాగస్వాములుగా భావించే రైతులు.. పంటల సాగులో సాయపడిన ఎద్దులను నందీశ్వరులుగా, భూమిని భూమాతగా, వర్షాన్ని వరుణ దేవుడిగా కొలవడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించే ఉద్దేశంతో ఈ పండగను ప్రతి ఏడాది భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. శ్రావణ మాసంలోని బహుళ పక్ష అమావాస్యను పురస్కరించుకుని ఈ నెల 11న పొలాల అమావాస్యను జిల్లాలో ఆనందోత్సాహాల మధ్య నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పండగ సందర్భంగా రైతులు తమ ఎద్దుల జతలను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేస్తారు. తెల్లవారుజామున ఇళ్లను శుభ్రం చేసి, గుమ్మాలకు మామిడి తోరణాలు కడతారు. అనంతరం ఎద్దులు, ఇతర పశువులను చెరువులు, బావుల వద్దకు తీసుకెళ్లి స్నానం చేయించి పూజలు ప్రారంభిస్తారు. పసుపు, కుంకుమలతో ఎద్దులను అలంకరించి మంగళహారతులు ఇస్తారు. అమావాస్య రోజున మట్టితో ఎద్దుల ప్రతిమలను తయారు చేసి పూజించే సంప్రదాయం కూడా ఉంది. గ్రామాల్లోని హనుమాన్ దేవాలయాలకు అలంకరించిన ఎద్దులను తీసుకెళ్లి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు.
పూజల అనంతరం ఎద్దులకు పిండి వంటలు, బూరెలు, నైవేద్యాలను సమర్పిస్తారు. వ్యవసాయానికి ఆయువుపట్టుగా నిలిచే ఎద్దులు కష్టనష్టాల్లో తమకు తోడుగా ఉంటాయని రైతులు విశ్వసిస్తారు. బసవన్నలను పూజిస్తే పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయని నమ్మకం. పశుసంపదతో రైతులకు ఉన్న అనుబంధం, గ్రామీణ జీవన విధానం, సంప్రదాయాలను ప్రతిబింబించేలా పొలాల అమావాస్య వేడుకలు తెలంగాణ పల్లెల్లో వైభవంగా సాగనున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!