

దీర్ఘకాలంగా జాప్యం అవుతున్న ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులను పూర్తి చేసి వచ్చే జూన్ నాటికి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలంగాణ శాసనమండలిలో హామీ ఇచ్చారు. ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, సభ్యులు తీన్మార్ మల్లన్న, పింగిళి శ్రీపాల్రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 2017–18లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పలు నిర్వహణపరమైన సమస్యలతో నిలిచిపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డంకులను తొలగించి పనులను వేగవంతం చేసిందని తెలిపారు.
ప్రధాన కాంట్రాక్టర్ జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ను ఆశ్రయించడంతో పాటు మధ్యలో పనులు చేపట్టిన మరో సంస్థ కూడా ఆశించిన స్థాయిలో పనులు పూర్తి చేయలేకపోయిందని కోమటిరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి ఏ. రేవంత్రెడ్డి జోక్యంతో గాయత్రీ ప్రాజెక్ట్స్తో సమన్వయం చేసుకుని పనులను తిరిగి ప్రారంభించి వేగవంతం చేసినట్లు చెప్పారు. కారిడార్ కింద రహదారి పునరుద్ధరణ, ఉపరితల మరమ్మతులు పూర్తయ్యాయని, ప్రస్తుతం నిరంతరాయంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఇటీవల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి రవాణా ఏర్పాట్లు, కాంట్రాక్టర్కు సకాలంలో చెల్లింపులపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. గతంలో దసరాకు పూర్తి చేయాలన్న లక్ష్యం వాయిదా పడినా, కొత్తగా నిర్ణయించిన జూన్ గడువును తప్పకుండా చేరుకుంటామని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!