

తెలంగాణలో 22-A భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, అర్హులైన ప్రజల ఆస్తులను 22-A జాబితా నుంచి తొలగించి వారి ఆస్తిహక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ జనసేన తెలంగాణ ఆధ్వర్యంలో శుక్రవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన దీక్ష నిర్వహించారు. జనసేన తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ నేమూరి శంకర్ గౌడ్ పిలుపుతో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాలకు చెందిన పార్టీ నాయకులు, మహిళా నాయకులు, యువతతో పాటు 22-A సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ ప్రజల ఆస్తిహక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, 22-A సమస్యకు తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఈ సమస్య కొంతమందికి మాత్రమే సంబంధించినది కాదని, అనేక మంది ప్రజల భూములు, ఆస్తులు, జీవితాలతో ముడిపడి ఉందని అన్నారు. బాధితులకు న్యాయబద్ధమైన పరిష్కారం లభించే వరకు జనసేన పోరాటం కొనసాగుతుందని తెలిపారు. జనసేన ప్రచార కార్యదర్శి సాగర్ ఆర్.కె. నాయుడు మాట్లాడుతూ చట్టబద్ధంగా సంపాదించుకున్న భూములు, ఆస్తులపై అనవసరమైన ఆంక్షలు లేకుండా ప్రభుత్వం స్పష్టమైన, పారదర్శకమైన విధానాన్ని తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా బాధితులు తమ భూములు, ఆస్తులకు సంబంధించిన పత్రాలను జనసేన నాయకులకు అందజేసి, సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!