

హైదరాబాద్లో మరోసారి భారీగా గంజాయి పట్టుబడింది. గంజాయిని అక్రమంగా తరలిస్తూ విక్రయిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ ఎస్టీఎఫ్ అధికారులు అరెస్ట్ చేశారు. కొండాపూర్ ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని ఓ హోటల్లో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు అక్కడ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అస్సాంకు చెందిన ధీరజ్ దాస్ (39), రబాలి అలీ (25)ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.9 లక్షల విలువైన 17.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు హోటల్లో గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లుగా విక్రయిస్తున్నట్లు ఎస్టీఎఫ్ అధికారులు తెలిపారు.
విచారణలో నిందితులిద్దరూ గతంలో హైదరాబాద్లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేసినట్లు అధికారులు గుర్తించారు. జీతం సరిపోకపోవడంతో గంజాయి విక్రయాల వైపు మళ్లినట్లు ఎక్సైజ్ విచారణలో వెల్లడైంది. అస్సాం నుంచి గంజాయిని హైదరాబాద్కు తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం నిందితులిద్దరినీ ఎస్టీఎఫ్ అధికారులు కొండాపూర్ ఎక్సైజ్ పోలీసులకు అప్పగించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!