

రాజధాని హైదరాబాద్ నగరంలో ఓటర్ల సంఖ్యలో భారీ మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే కారణంగా గ్రేటర్ పరిధిలో ఏకంగా 40 లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగిపోయే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రేపటితో ఈ సర్వే కార్యక్రమం ముగియనుండగా, నిన్నటి వరకు ఉన్న సమాచారం ప్రకారం రాజధానిలోని మూడు జిల్లాల పరిధిలో ఉన్న 28 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 1.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో దాదాపు మూడో వంతు ఓట్లు రద్దయ్యే సూచనలు కనిపిస్తుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వ సెలవులు ఉన్నప్పటికీ ఆది, సోమవారాల్లో బూత్ స్థాయి అధికారుల (బీఎల్ఓ) నుంచి ఉన్నతాధికారుల వరకు విధుల్లోనే ఉంటారని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించని ఓటర్లు ఎవరైనా ఉంటే వెంటనే అందజేయాలని ఆయన సూచించారు. క్షేత్రస్థాయిలో సర్వే పూర్తి చేసి, ఈ నెల 17న ముసాయిదా ఓటరు జాబితాను ప్రకటించేందుకు అధికారులు వేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఓట్ల తొలగింపు ప్రభావం దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ఇది అత్యధికంగా ఉంది. ముఖ్యంగా సనత్నగర్ నియోజకవర్గంలో మొత్తం 2,54,030 ఓట్లు ఉండగా, వాటిలో ఏకంగా 1.16 లక్షల ఓట్లు (45.68%) రద్దయ్యే అవకాశం ఉందని అంచనా. అదేవిధంగా జూబ్లీహిల్స్లో 44.21%, ఎల్బీనగర్లో 42.19%, ఉప్పల్లో 40.05%, మహేశ్వరంలో 40.03% ఓట్లు జాబితా నుంచి తొలగిపోవచ్చని అధికారులు చెబుతున్నారు. అత్యల్పంగా ఇబ్రహీంపట్నంలో 21.43% ఓట్లు రద్దయ్యే అవకాశం ఉంది. రాబోయే రెండు రోజుల్లో ఈ సంఖ్యల్లో స్వల్ప మార్పులు మాత్రమే ఉండొచ్చని భావిస్తున్నారు.
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉపాధి, ఇతర అవసరాల కోసం ప్రతిరోజూ వేలాది మంది హైదరాబాద్కు వలస వస్తుంటారు. ఇక్కడే స్థిరపడి ఓటరుగా నమోదు చేసుకుంటారు. అయితే, ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఓటరు సర్వే జరుగుతున్న నేపథ్యంలో.. సొంత ఊరితో పాటు హైదరాబాద్లోనూ ఓటు హక్కు ఉన్నవారు తమ ఓటును సొంతూరిలోనే కొనసాగించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో నగరంలో ఎన్యుమరేషన్ ఫారాలను చాలామంది అధికారులకు తిరిగి ఇవ్వలేదని తెలుస్తోంది. ఇదే ఓట్ల సంఖ్య భారీగా తగ్గడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!