

శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యను పోలాల అమావాస్యగా పిలుస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 11న శ్రావణ బహుళ అమావాస్య సందర్భంగా పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. సంతానం లేనివారు, పిల్లల అభివృద్ధి, ఆయురారోగ్యాలను కోరుకునేవారు ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారని ఆధ్యాత్మిక విశ్వాసం. సనాతన ధర్మంలో అమావాస్యను పర్వదినంగా భావిస్తారు. ముఖ్యంగా శ్రావణ అమావాస్యకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని పురాణాలు, సంప్రదాయాలు పేర్కొంటాయి.
పోలాల అమావాస్యకు సంబంధించిన కథలో, సంతానం కలిగినప్పుడల్లా పిల్లలను కోల్పోతున్న ఓ చిన్నకోడలికి గ్రామదేవత పోలాలమ్మ దర్శనమిచ్చి, మరణించిన పిల్లలను వారి పేర్లతో పిలవమని సూచించినట్లు చెబుతారు. ఆమె అలా చేయడంతో పిల్లలు తిరిగి జీవించారని, అనంతరం పోలాలమ్మపై కృతజ్ఞతతో ఈ వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించారని విశ్వాసం. వ్రతంలో గణపతి, మంగళ గౌరీదేవి, సంతానలక్ష్మిని పూజించి, తొమ్మిది ముళ్లతో తోరం కట్టడం, తొమ్మిది బూరెలు, తొమ్మిది గారెలు, తొమ్మిది రకాల కూరలతో చేసిన పులుసును నైవేద్యంగా సమర్పించడం, ముత్తైదువుకు తాంబూలం ఇవ్వడం వంటి ఆచారాలు ఉంటాయి. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల సంతాన సంబంధిత కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!