

మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని వారి వద్దకే తీసుకెళ్లేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వైద్యం కోసం ప్రజలు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన అవసరం లేకుండా.. ప్రతి కుటుంబానికీ మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమన్నారు. అరకు లోయ నియోజకవర్గంలోని గన్నెలిలో సంజీవని ప్రాజెక్టు అమలు తీరును పరిశీలించిన సీఎం.. త్వరలోనే ఈ ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్నట్లు తెలిపారు. వ్యక్తిగత డిజిటల్ హెల్త్ రికార్డుల ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను నమోదు చేసి మెరుగైన వైద్య సేవలు అందించనున్నట్లు చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య మౌలిక వసతుల కోసం రూ.250 కోట్లతో ట్రైబల్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంప్లీషన్ మిషన్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. డ్రోన్ల ద్వారా రక్త నమూనాలను పెద్ద ఆసుపత్రులకు తరలించి పరీక్షలు నిర్వహించడం, 104 వాహనాల ద్వారా సంచార వైద్యం, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ద్వారా గర్భిణులకు సేవలు, ఇంటి వద్దే 41 రకాల వైద్య పరీక్షలు నిర్వహించే కార్యక్రమాలను వివరించారు.
గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్యంతో పాటు మౌలిక వసతులు, ఉపాధి, పర్యాటకం, కనెక్టివిటీని కూడా ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకుంటోందని చంద్రబాబు తెలిపారు. ‘అడవి తల్లి బాట’ కార్యక్రమం కింద రూ.1,000 కోట్లతో 905 కిలోమీటర్ల రహదారులను నిర్మించినట్లు చెప్పారు. 1.60 లక్షల ఇళ్లకు కుళాయి ద్వారా తాగునీరు అందించడంతో పాటు సోలార్ రూఫ్టాప్లను ప్రోత్సహిస్తామన్నారు. అరకు కాఫీ సాగును మరో లక్ష ఎకరాలకు విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పర్యాటకులను ఆకర్షించేలా హోమ్స్టేలను ప్రోత్సహించి గిరిజన కుటుంబాలకు అదనపు ఆదాయం కల్పిస్తామని చెప్పారు. పరిశ్రమల్లో గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు లభించేలా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని, వచ్చే మూడేళ్లలో లక్ష మంది యువతకు శిక్షణ ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!