

నగర కోలాహలానికి దూరంగా నల్లమల కొండలు, పచ్చని ప్రకృతి మధ్య వెలసిన ఓ ప్రాచీన శివక్షేత్రం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. భక్తులు ‘తెలంగాణ శ్రీశైలం’గా ఆరాధించే ఈ క్షేత్రానికి శతాబ్దాల చరిత్ర ఉందని స్థానిక విశ్వాసం. కొండపై వెలసిన ఈ ఆలయం శైవ సంప్రదాయంలో ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. నల్లమల అటవీ ప్రాంతంలో కొండపై ఉన్న ఉమామహేశ్వరం ప్రాచీన శివాలయంగా, శ్రీశైలానికి ఉత్తర ద్వారంగా అధికారిక జిల్లా సమాచారం పేర్కొంటోంది.
ఆలయ స్థలపురాణం, స్థానిక భక్తుల విశ్వాసాల ప్రకారం.. పూర్వకాలంలో అనేకమంది మునులు, మహర్షులు ఈ పవిత్ర కొండపై ఘోర తపస్సు చేసి పరమశివుడి అనుగ్రహాన్ని పొందారని చెబుతారు. ఈ క్షేత్రానికి శివుడి రౌద్రరూపమైన వీరభద్ర స్వామితోనూ పలు ఆధ్యాత్మిక కథనాలు ముడిపడి ఉన్నాయి. పవిత్ర జలధారలు, కొండలు, దట్టమైన అడవుల మధ్య ఆలయం ఉండటంతో ఇక్కడి వాతావరణం భక్తులకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. పురాతన విశ్వాసాలు, ప్రకృతి సౌందర్యం కలగలిసిన ఈ క్షేత్రం నేటికీ భక్తుల పుణ్యదర్శన కేంద్రంగా కొనసాగుతోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!