

రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మరోసారి తీవ్రరూపం దాల్చింది. ఇరుదేశాలు పరస్పరం జరిపిన తాజా దాడుల్లో కనీసం 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మాస్కోపై ఉక్రెయిన్ నిర్వహించిన డ్రోన్ దాడుల్లో ఐదుగురు మరణించగా, మరో 10 మంది గాయపడ్డారు. అలాగే సెయింట్ పీటర్స్బర్గ్లోని వైల్డ్బెర్రీస్ గోదాముపై దాడి జరగడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉక్రెయిన్ ప్రయోగించిన 320 డ్రోన్లను కూల్చివేసినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది.
ఇక రష్యా దళాలు ఉక్రెయిన్లోని మైకోలైవ్, పివ్డెన్యి, ఒడెసా పోర్టులపై దాడులు నిర్వహించి చమురు, ఆయుధాలు, సైనిక సామగ్రి తరలిస్తున్న నాలుగు నౌకలను ధ్వంసం చేసినట్లు ప్రకటించాయి. రష్యా దాడుల్లో మైకోలైవ్లో ఒకరు, సుమీలో ఇద్దరు బాలికలు, ఒక వృద్ధురాలు, ఖర్కీవ్లో మరొకరు మృతిచెందారు. క్రమటోర్స్క్పై గ్లైడ్ బాంబులతో జరిగిన దాడిలో మరో 22 మంది గాయపడినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!