

శ్రీకాకుళం జిల్లాలో యువతలో పెరుగుతున్న స్పోర్ట్స్ బైక్ల మోజు ప్రాణాంతకంగా మారుతోంది. రెండు రోజుల కిందట శ్రీకాకుళం నగరంలోని పాత వంతెనపై ముగ్గురు యువకులు స్పోర్ట్స్ బైక్పై వేగంగా వెళ్తూ ఆగి ఉన్న వ్యాన్ను ఢీకొట్టిన ఘటనలో రెల్లివీధికి చెందిన 22 ఏళ్ల యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మూడు నెలల కిందట జీటీ రహదారిపై స్నేహితుడి స్పోర్ట్స్ బైక్పై వెళ్తున్న మరో యువకుడు పేవ్మెంట్ను ఢీకొట్టి, అనంతరం విద్యుత్తు స్తంభానికి తల తగలడంతో ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాద సమయంలో బైక్ స్పీడోమీటర్లో 110 కి.మీ. వేగం నమోదైనట్లు సమాచారం. జిల్లాలో ఏటా రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న వారిలో దాదాపు 30 శాతం మంది యువతేనని పేర్కొంటున్నారు.
డ్రైవింగ్లో అనుభవం లేకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం, ఫోన్ మాట్లాడుతూ అతివేగంతో వెళ్లడం, అధిక సామర్థ్యం కలిగిన బైక్లకు అనువైన రహదారులు లేకపోవడం ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. గతంలో పట్టణాలు, సంపన్న కుటుంబాలకు ఎక్కువగా పరిమితమైన అధిక సీసీ స్పోర్ట్స్ బైక్లు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనూ విస్తరిస్తున్నాయి. కొందరు తల్లిదండ్రులు పిల్లల కోరిక మేరకు చిన్న వయసులోనే ఖరీదైన బైక్లు కొనివ్వడం, ఆ తర్వాత వారి డ్రైవింగ్ తీరును పర్యవేక్షించకపోవడం కూడా ఆందోళన కలిగిస్తోంది. అతివేగం చట్టరీత్యా నేరమని అధికారులు హెచ్చరిస్తుండగా, ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించడంతో పాటు తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా అవసరమని సూచిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!