

దిల్లీలో జులై 20న జరిగిన విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసులు లాఠీఛార్జీ చేయడం, మితిమీరిన బలప్రయోగానికి పాల్పడటంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజ్యాంగం ప్రకారం ప్రజలకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పేర్కొన్నారు. ఆందోళనలను కారణంగా చూపుతూ నిరసనకారులపై అధిక బలప్రయోగం చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. శాంతియుత నిరసనలు, వాటి సందర్భంగా పోలీసులు అనుసరించాల్సిన విధానంపై ఏకరూప మార్గదర్శకాలు అవసరమని అభిప్రాయపడ్డారు. పోలీసుల చర్యలపై స్వతంత్ర దర్యాప్తు జరపడంతో పాటు సీసీటీవీ ఫుటేజీ, బాడీ కెమెరా రికార్డింగ్లను భద్రపరచాలని, గాయపడిన వారికి పరిహారం అందించాలని పిటిషనర్లు కోరారు.
మరోవైపు నిరసనల్లోకి చొరబడి పోలీసులపై దాడులకు పాల్పడే వ్యక్తుల విషయంలో జస్టిస్ జోయ్మాల్య బాగ్చి ఆందోళన వ్యక్తం చేశారు. హింసకు పాల్పడే వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులకు తగిన అధికారాలు ఉండాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి ప్రాణం ముఖ్యమేనని, నిరసనకారులు హింసకు తావులేకుండా క్రమశిక్షణ పాటించాలని ధర్మాసనం సూచించింది. విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. మరోవైపు నీట్ను ఆన్లైన్లో నిర్వహించాలన్న అభ్యర్థనలపై విచారణ సందర్భంగా, ప్రశ్నపత్రాల లీకేజీ నివారణకు నందన్ నీలేకని నేతృత్వంలోని కమిటీ చేసే సిఫార్సులను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు పేర్కొంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!