

తమిళనాడు ప్రజలకు ముఖ్యమంత్రి విజయ్ కీలక శుభవార్త ప్రకటించారు. ముఖ్యమంత్రి సమగ్ర ఆరోగ్య బీమా పథకం కింద ప్రతి కుటుంబానికి ఏటా అందించే బీమా మొత్తాన్ని రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు వెల్లడించారు. ఆదాయం, నివాస ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పెరుగుతున్న వైద్య ఖర్చుల నేపథ్యంలో కుటుంబాలకు మరింత ఆర్థిక భద్రత కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
అదే సమయంలో ప్రభుత్వ రంగ సంస్థ ఆవిన్ సేకరించే పాల ధరను కూడా పెంచారు. లీటరుకు రూ.38గా ఉన్న పాల సేకరణ ధరను రూ.41కు పెంచుతున్నట్లు విజయ్ ప్రకటించారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 3.16 లక్షలకుపైగా పాల ఉత్పత్తిదారులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో ఉన్నప్పటికీ రైతుల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని ధర పెంచినట్లు చెప్పారు. గత డీఎంకే ప్రభుత్వం పాల సేకరణ ధర పెంపుపై తగిన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. మరోవైపు ఎమ్మెల్యేలకు ప్రభుత్వ ఖర్చుతో వాహనాలు అందించడంతో పాటు వాటి నిర్వహణ, ఇంధనం, డ్రైవర్ జీతాల కోసం నెలకు రూ.75 వేల ప్రత్యేక అలవెన్స్ మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!