

నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రామ్ కింద టీజీఎస్ఆర్టీసీ నిర్వహిస్తున్న జేబీఎం ఎలక్ట్రిక్ బస్సుల్లో వరుసగా హై వోల్టేజ్ బ్యాటరీలకు సంబంధించిన ప్రమాదాలు చోటుచేసుకోవడంతో సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల పరిధిలో నడుస్తున్న జేబీఎం సంస్థకు చెందిన ఎలక్ట్రిక్ బస్సుల సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇటీవల కరీంనగర్ సమీపంలోని అలుగునూర్లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై పూర్తి నివేదిక రాకముందే మరో సంఘటన జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీజీఎస్ఆర్టీసీ వెల్లడించింది.
జేబీఎం సంస్థ నుంచి ప్రమాదాల విశ్లేషణ నివేదిక, శాశ్వత నివారణ చర్యలు, బ్యాటరీ ఫిట్నెస్ ధ్రువీకరణ, హైదరాబాద్ బస్ భవన్లో కమాండ్ కంట్రోల్ వ్యవస్థ ఏర్పాటు తదితర అంశాలపై సమగ్ర నివేదికలను కోరినట్లు ఆర్టీసీ తెలిపింది. సంస్థ విధించిన అన్ని భద్రతా ప్రమాణాలను పూర్తిగా అమలు చేసి, సాంకేతిక నిపుణులు "వాహనం సేవలకు అనుకూలం" అని ధ్రువీకరించిన తర్వాత మాత్రమే బస్సుల సేవలను తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. ప్రజారవాణా భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!