

అమెరికాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు 2025 అడ్మిషన్ సీజన్లో స్టూడెంట్ వీసాల విషయంలో భారీ తగ్గుదల నమోదైంది. సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ అధ్యయనం ప్రకారం, మే నుంచి ఆగస్టు మధ్య అమెరికా కాన్సులేట్లు భారతీయులకు 22,149 ఎఫ్-1 స్టూడెంట్ వీసాలు జారీ చేశాయి. 2024లో ఇదే కాలంలో 58,694 వీసాలు జారీ కాగా, ఈసారి 62 శాతం తగ్గాయి. చైనా విద్యార్థుల వీసాలు కూడా తగ్గినా, ఆ తగ్గుదల 34 శాతంగా ఉంది. చైనీయులకు జారీ చేసిన వీసాలు 61,075 నుంచి 40,034కి పడిపోయాయి.
వీసాల సంఖ్య తగ్గినప్పటికీ అమెరికా విద్యాసంస్థల్లో అత్యధికంగా చేరుతున్న విదేశీ విద్యార్థులు భారతీయులే. ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ గణాంకాల ప్రకారం, 2024-25 విద్యా సంవత్సరంలో 3,63,019 మంది భారతీయ విద్యార్థులు అమెరికా కాలేజీలు, యూనివర్సిటీల్లో చేరారు. ట్రంప్ ప్రభుత్వం వలస విధానాలను కఠినతరం చేస్తున్న సమయంలో ఈ తగ్గుదల చోటుచేసుకుంది. ఎఫ్-1 విద్యార్థుల నివాస నిబంధనల్లో మార్పులు తీసుకురావడంతో పాటు, నాలుగేళ్లకు మించి అమెరికాలో ఉండే విద్యార్థులకు అదనపు అనుమతి అవసరమయ్యే విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. విదేశీ జర్నలిస్టుల వీసాల కోసం సోషల్ మీడియా వెట్టింగ్ను కూడా పరిశీలిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!