

వినాయక చవితిని పర్యావరణహితంగా జరుపుకోవాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. ఈసారి ప్రతి ఒక్కరూ సీడ్ గణేశుడిని పూజించి ప్రకృతి సంరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు. సహజ మట్టి విగ్రహాలను పూజించడం వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందని, పూజ అనంతరం ఇంట్లోనే నిమజ్జనం చేస్తే విగ్రహం కరిగిపోయి అందులోని విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా ఎదుగుతాయని తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్తో కలిసి చిరంజీవి తన స్వగృహంలో 2026 సీజన్ సీడ్ గణేశా ప్రతిమలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పచ్చదనం పెంపు కోసం సంతోష్ కుమార్ చేస్తున్న కృషిని చిరంజీవి ప్రశంసించారు.
సహజ మట్టి, కోకోపీట్, కొబ్బరి పొడితో సీడ్ గణేశా ప్రతిమలను తయారు చేస్తున్నారు. వీటి లోపల వేప, చింత వంటి దేశీయ వృక్షాల విత్తనాలను ఉంచుతున్నారు. నవరాత్రుల అనంతరం ప్రతిమను కుండలో లేదా పెరట్లోని మట్టిలో ఉంచి నీళ్లు పోస్తే.. ప్రతిమ కరిగి విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా ఎదుగుతాయి. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయన రంగులతో తయారయ్యే విగ్రహాల వల్ల జలవనరులు కలుషితం కాకుండా ఉండేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. కోవిడ్ సమయంలో 2020లో ప్రారంభమైన సీడ్ గణేశా కార్యక్రమం ద్వారా ఏటా వేలాది ప్రతిమలను పంపిణీ చేస్తూ పర్యావరణహిత వినాయక చవితిపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రకారం ఇప్పటివరకు ఈ కార్యక్రమం ద్వారా సుమారు 19.6 కోట్ల చెట్లను నాటేందుకు ప్రోత్సాహం లభించింది. చిరంజీవి మద్దతుతో ఈ వినూత్న ఆలోచన మరింత మందికి చేరువయ్యే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!