

దేశంలో పిల్లలు, కిశోరుల్లో ఊబకాయం, మధుమేహం, రక్తపోటు వంటి జీవనశైలి వ్యాధులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత వైద్య పరిశోధనా మండలి ఆధ్వర్యంలోని జాతీయ పోషకాహార సంస్థ రూపొందించిన విధాన పత్రం కీలక సూచనలు చేసింది. ‘లెట్స్ ఫిక్స్ అవర్ ఫుడ్’ కన్సార్టియం భాగస్వామ్యంతో రూపొందిన ఈ నివేదిక ప్రకారం 2025 నాటికి 5 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు గల సుమారు 4.1 కోట్ల మంది పిల్లలు అధిక బరువు లేదా ఊబకాయంతో బాధపడుతున్నారు. పరిస్థితులు మారకపోతే 2030 నాటికి ప్రపంచ బాల్య ఊబకాయంలో భారత్ వాటా 11 శాతానికి మించి ఉండే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
ఈ విధానంలో జంక్ ఫుడ్ ప్రకటనలపై కఠిన నియంత్రణ, ప్యాకెట్లపై స్పష్టమైన పోషకాహార లేబుళ్లు, పాఠశాలల్లో ఆరోగ్యకరమైన ఆహార వాతావరణం, అధిక కొవ్వు ఉప్పు చక్కెర కలిగిన ఆహారాలపై ప్రత్యేక పన్నులు వంటి సూచనలు ఉన్నాయి. అలాగే ఆయుష్మాన్ భారత్ పాఠశాల ఆరోగ్య కార్యక్రమాలతో అనుసంధానం చేసి పిల్లల్లో ఆరోగ్యకర జీవనశైలిపై అవగాహన పెంచాలని సూచించారు. పాఠశాల ఆహార అంచనా సాధనం, ఆహార లేబుళ్లపై అవగాహన కల్పించే డిజిటల్ పాఠాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఈ కార్యక్రమానికి యూనిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆహార భద్రత ప్రమాణాల సంస్థ, ప్రజారోగ్య ఫౌండేషన్ వంటి సంస్థలు మద్దతు ఇస్తున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!