

"తండేల్" తర్వాత కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్న నాగచైతన్య ప్రస్తుతం "వృషకర్మ" చిత్రంతో బిజీగా ఉన్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా పూర్తికాకముందే తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి పెట్టిన ఆయన, ఇప్పటికే పలు కథలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో "మసూద"తో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు సాయికిరణ్తో చైతూ చర్చలు జరుపుతున్నారనే వార్తలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. భయానక అంశాలతో కూడిన హారర్ థ్రిల్లర్ కథను దర్శకుడు సిద్ధం చేసినట్లు సమాచారం.
బాక్సాఫీస్ వద్ద తొలి ప్రయత్నంతోనే గుర్తింపు తెచ్చుకున్న సాయికిరణ్, గత రెండేళ్లుగా ఈ కథపై ప్రత్యేకంగా పనిచేశారని తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత ఏషియన్ సునీల్ నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ కోసం నాగచైతన్యను సంప్రదించగా, ఆయన కథను విన్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు "బెదురులంక 2012" దర్శకుడు క్లాక్స్తో కూడా చైతూ ఇప్పటికే ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. "వృషకర్మ" పూర్తి అయిన వెంటనే ఆ చిత్రం ప్రారంభం కానుండగా, సాయికిరణ్ కథకు కూడా ఓకే చెబితే వచ్చే ఏడాది ఈ హారర్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!